Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు గురువారం సమావేశమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంటను మొదలుపెట్టారు. అయితే అదానీపై హిండెన్బర్గ్ నివేదిక గురించి చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు ఈ విషయంపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే, ఇందుకు సభాపతి అంగీకరించలేదు. ప్రశ్నోత్తరాల గంట చాలా ముఖ్యమైందని, సభ్యులు అంతరాయం కలిగించొద్దని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమవ్వగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో సభలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.