Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విమానాశ్రయంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. తమ బిడ్డకు టికెట్ తీసుకునేందుకు నిరాకరించిన ఓ జంట.. ఆ చిన్నారిని చెక్ ఇన్ కౌంటర్ వద్దే వదిలి విమానం ఎక్కేందుకు వెళ్లిపోయారు. బెల్జియం వెళ్లేందుకు ఓ జంట తమ బిడ్డతో కలిసి ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానం ఎక్కాలంటే చిన్నారికి కూడా టికెట్ తీసుకోవాలని సిబ్బంది తెలిపారు. అప్పటికే ఎయిర్పోర్టుకు ఆలస్యంగా వచ్చిన ఆ జంట.. బిడ్డకు టికెట్ తీసుకోలేదు సరికదా.. స్ట్రోలర్లో ఉన్న బిడ్డను వదిలేసి బోర్డింగ్ పాయింట్ వద్దకు వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆ జంటను వెనక్కి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం అయిందని, ఆ చిన్నారి వారి తల్లిదండ్రుల చెంత ఉందని తెలిపారు. దీనిపై అక్కడి సిబ్బంది స్పందిస్తూ.. 'ఇలాంటి ప్రవర్తనను మేం ఇంతకుముందెన్నడూ చూడలేదు. మా కళ్లను మేం నమ్మలేకపోయాం' అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్న ఆ జంట విమానం ఎక్కడ మిస్ అవుతుందోనన్న తొందరలో ఉన్నారని, ఆ కంగారులో తమ బిడ్డనే మర్చిపోతున్నామనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారని మరో అధికారి వెల్లడించారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.