Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో 1601 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. డైరెక్ట్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ గురువారం ఓ సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. అయితే, ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన నోటిఫికేషన్ను ఈ నెల 15 లేదా ఆ తర్వాత తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. రాతపరీక్ష, నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గతేడాది మే నెలలోనే 1000 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినప్పటికీ.. కొందరు వ్యక్తులు ఈ పరీక్షలో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని నియామక ప్రక్రియను రద్దు చేశారు. తాజాగా, టీఎస్ఎస్పీడీసీఎల్లో ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలంటూ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆ సంస్థ ఛైర్మన్ రఘుమారెడ్డిని ఆదేశించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.
జూనియర్లైన్ మ్యాన్ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్మ్యాన్) లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్మెన్ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్లు. వేతన శ్రేణి రూ.రూ.24340- రూ.39405గా నిర్ణయించారు.
అదే అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకైతే ఇంజినీరింగ్లో డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండొచ్చు. వేతనశ్రేణి రూ. రూ.64,295- రూ.99,345గా నిర్ణయించారు.