Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు : కుటుంబ గొడవలతో ఇనుప డంబెల్తో భార్యను కొట్టి చంపాడో కిరాతక భర్త. జీవితాంతం తోడు నీడగా చూసుకుంటానన్న పెళ్లినాటి ప్రమాణాలను తుంగలో తొక్కి దారుణంగా బలిగొన్నాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణరాజపురం పరిధిలోని రామ్మూర్తినగరలో ఉన్న హొయ్సళ స్ట్రీట్లో గురువారం చోటు చేసుకుంది. లిడియా (44) భర్త చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యురాలు.
మోరిస్, లిడియాలకు 15 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మోరిస్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఉదయం ముగ్గురు పిల్లలు స్కూల్కు వెళ్లిన తరువాత భార్యభర్త గొడవపడ్డారు. ఈ సమయంలో ఉన్మాదిగా మారిన మోరిస్ ఇనుప డంబెల్ను తీసుకుని భార్య తలను నుజ్జు చేశాడు. రక్తపుమడుగులో ఆమె శవమైంది. ఇరుగుపొరుగు సమాచారం అందించడంతో రామ్మూర్తినగర పోలీసులు వచ్చి నిందితున్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణం, తండ్రి జైలుపాలు కావడంతో పిల్లలు అనాథల్లా మారారు.