Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఇటీవల భారత్కు చెందిన దగ్గు మందుల కారణంగా గాంబియా, ఉజ్బెకిస్థాన్లో చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మన దేశానికి చెందిన మరో ఔషధంలో నాణ్యతా లోపం బయటపడింది. భారత్కు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ ప్రయివేటు లిమిటెడ్ తయారు చేసిన ఎజ్రీకేర్ కంటి చుక్కల మందు కారణంగా అమెరికాలో పలువురికి కంటిచూపు మందగించడమే గాక.. ఒకరు మృతి చెందడంతో ఈ అంశం బయటకు వచ్చింది. దీంతో ఆ మందుపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే అమెరికా విపణి నుంచి ఆ కంటి చుక్కలను రీకాల్ చేసుకుంటున్నట్టు భారత కంపెనీ వెల్లడించింది.
ఎజ్రీకేర్ కంటి చుక్కల కారణంగా 12 రాష్ట్రాల్లో కనీసం 55 మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని అమెరికా నిన్న ప్రజలను హెచ్చరించింది. ఇందులో ఒకరు ఇన్ఫెక్షన్ కారణంగా మరణించగా.. మరో ఐదుగురికి కంటిచూపు పోయిందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘న్యూయార్క్, వాషింగ్టన్తో పాటు మరో 10రాష్ట్రాల్లో పలువురు కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్ కనిపించింది’’ అని సీడీసీ తెలిపింది. ఈ క్రమంలోనే ఎజ్రికేర్, డెల్సామ్ కంటి చుక్కల కొనుగోళ్లు, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. వైద్యులు, వినియోగదారులను హెచ్చరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఎజ్రీకేర్, ఎల్ఎల్సీ, డెల్సామ్ ఫార్మా పంపిణీ చేసిన ఆర్టిఫిషియల్ టియర్స్ లూబ్రికాంట్ కంటి చుక్కల మందు సీసాలను మార్కెట్ నుంచి స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నాం. ఈ మందు కలుషితమయ్యే అవకాశాలున్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని సంస్థ వెల్లడించింది. మరోవైపు అమెరికా సీడీసీ కూడా ఈ మందును పరీక్షిస్తోంది.