Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలైంది. వ్యాధి తగ్గాలని చిన్నారి శరీరంపై 51 సార్లు ఇనుప కడ్డీతో వాతలు పెట్టారు. అయినా వ్యాధి తగ్గకపోవడంతో 15 రోజులు మృత్యువుతో పోరాడిన అభం శుభం తెలియని ఆ పసికందు.. చివరికి తనువు చాలించింది. వివరాల్లోకి వెళితే.. గిరిజన ప్రాంతమైన షాదోల్ జిల్లాలోని సింగ్పుర్ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి నిమోనియా బారినపడింది. దీంతో చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా స్థానికంగా ఉన్న మంత్రగాళ్లకు చూపించారు. ఈ క్రమంలో మంత్రగాళ్లు పాప పొట్ట చుట్టూ కాల్చిన ఇనుప రాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. అయినప్పటికీ చిన్నారి ఆరోగ్యం కుదుట పడలేదుసరి కదా.. మరింత దిగజారింది. దీంతో వారు పసికందును స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారికి వ్యాధి సోకి అప్పటికే 15 రోజులు గడిచిపోవడంతో జరగరాని నష్టం జరిగిపోయింది. నిమోనియాకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువై చిన్నారి మృతి చెందింది. పాపకు తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. శుక్రవారం శిశు, సంక్షేమ శాఖ అధికారులు ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే వారు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఖననం చేసిన చోటుకెళ్లి.. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసేందుకు చర్యలు చేపట్టారు.