Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నర్సుల వివాదంపై సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. నర్సులంటే తనకెంతో గౌరవం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అధికారిక సోషల్మీడియాలో నర్సుల వివాదంపై స్పందిస్తూ సుదీర్ఘ నోట్ పోస్ట్ చేశారు. 'అందరికీ నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి వారి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను' అని అన్నారు. ఇటీవల ఓ ప్రముఖ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తనకు జరిగిన బైక్ యాక్సిడెంట్ విషయాన్ని ప్రస్తావించే సందర్భంలో తనకు వైద్యం చేసిన నర్సు గురించి ఆయన మాట్లాడారు. ఆ మాటలపై నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, నర్సులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.