Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాకినాడ
జిల్లాలో పెద్దాపురం మండలం జి.రాగంపేటలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీ ఆవరణలో ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఏడుగురు మరణించారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరాడక చనిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల వివరాల ప్రకారం పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చూస్తుంటారు. ఈ తరుణంలోనే రెండు రోజులుగా ట్యాంకర్లో ఆయిల్ మొత్తం తీసివేశారు. దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులకు ఊపిరి అందలేదు. వెంటనే బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అయితే సమయం గడుస్తున్నప్పటికీ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు బయటకు రాకపోవడంతో మిగిలిన కార్మికులు వెళ్లి చూడగా అందరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే ట్యాంకర్ను అప్పటికప్పుడు యంత్రాలతో కూల్చి అందరినీ బయటకు తీసుకువచ్చారు. వారంతా ఊపిరాడక చనిపోయినట్లు తోటి కార్మికులు గుర్తించారు.