Authorization
Sat May 17, 2025 06:00:32 am
నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమని.. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో మెట్రో రైల్ కొత్త పనులకు కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. దేశంలోని చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేస్తూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతోందని ఆయన ధ్వజమెత్తారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. మెట్రోలో ఏడీఎస్ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్ హయాంలోనిదని కేటీఆర్ చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ''హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసు. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. హైదరాబాద్లో రూ.985 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడుతున్నాం. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం-ఎస్ఎన్డీపీలో భాగంగా నగరం నలుమూలల మురుగునీటి వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నాం. తొలిదశలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చాం. కొన్ని పనులు పూర్తి కావడంతో.. ఎల్బీనగర్లోని కొన్ని కాలనీల్లో గత వర్షకాలంలో ముంపు సమస్య కొంత మేర తగ్గింది'' అని కేటీఆర్ వివరించారు.