Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కాల్పుల్లో గాయపడిన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి మృతి చెందారు. గుంటూరులోని ప్రైయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రొంపిచర్ల మండలంలోని అలవాల గ్రామంలో ఫిబ్రవరి ఒకటో తేదీ రాత్రి బాలకోటిరెడ్డి ఇంట్లో ఉండగా తుపాకీతో నిందితులు రెండురౌండ్లు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నరసరావుపేటలోని ఓ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్ను బయటకు తీశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను శుక్రవారం ఉదయం హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. బాలకోటిరెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడిగా, ఎంపీపీగా, గ్రామ సర్పంచిగా పని చేశారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్కి నమ్మిన బంటుగా పేరుంది. అదే ఒరవడిలో మండలంలో టీడీపీ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. అలవాల పంచాయతీ ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఆ తరువాత గ్రామంలో వైకాపా, టీడీపీలో వర్గపోరు మొదలైంది. ఈ వర్గపోరుకి అలవాల తిరునాళ్ల మరింత అజ్యం పోసింది. టీడీపీలో రెండు వర్గాలు రెండు ప్రభలను, వైసీపీకి చెందిన రెండు వర్గాలు రెండు ప్రభలు కట్టారు. ప్రభల వద్దకు ఇరు పార్టీల నేతలు వచ్చిన క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అది కాస్తా పార్టీ రంగు పులుముకొని వివాదాలకు దారి తీసింది. పార్టీల పరంగా వివాదాలు సద్దుమణిగినా ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే ఆరు నెలల వ్యవధిలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై రెండుసార్లు దాడులు జరిగాయి. చివరికి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచారు.