Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వేదికగా ఈ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. సమావేశాల సందర్భంగా నేడు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో మొత్తం 6 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో సాయంత్రం 4 గంటలకు తీర్మానాలను ఖరారు చేయనున్నారు.
అయితే దీనీలో ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించి స్టీరింగ్ కమిటీ నిర్ణయించనుంది. అయితే ఈ చర్చకు పార్టీ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పూర్తి స్వేచ్ఛను, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చేందుకే వారీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశాలలో యువత-నిరుద్యోగం, సామాజిక న్యాయం-సాధికారత, వ్యవసాయరంగ సమస్యలు ఏఐసీసీ చర్చించనుంది. చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అధ్యక్షుడు ఖర్గే ఉపన్యాసంతో ప్లీనరీ ముగియనుంది. ముగింపు ఉపన్యాసంలో పార్టీ 5 సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం ఏఐసీసీ సమావేశాల్లో, ఆ తరువాత 4 గంటలకు జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. దీంతో పాటు 2024 ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే దానిపై కూడా ప్లీనరీలో చర్చ జరగనుంది.