Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: పరీక్షా ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం ప్రగతిభవన్కు వెళ్లిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.
టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ సహా ఏఈ, డీఏవో తదితర పరీక్షలను రద్దు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పరీక్షలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి నిర్వహించే పరీక్షల విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంతో పాటు అభ్యర్థులకు భరోసా ఇచ్చేలా, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.