Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. చెప్పుల్లో, బెల్టుల్లో బంగారం తరలించడం గతంలో మనం వినే ఉంటాం. ఇతగాడు మాత్రం కాస్త కొత్తగా ఆలోచించి.. బంగారాన్ని తరలించేందుకు కుమార్తె డైపర్ను వాడుకున్నాడు. మంగళూరు విమానాశ్రయంలో ఇటీవల చోటుచేసుకుందీ ఘటన. ఈ మేరకు కస్టమ్స్ అధికారులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళూరు ఎయిర్పోర్ట్కు వచ్చిన ఓ వ్యక్తి తన 22 నెలల కూమార్తె ధరించిన డైపర్లో బంగారాన్ని దాచాడు. అధికారులు తనిఖీ చేయగా బంగారంతో అడ్డంగా దొరికిపోయాడు. బంగారాన్ని పేస్ట్ రూపంలో ప్యాకెట్లుగా రూపొందించి డైపర్లో ఉంచినట్లు అధికారులు గుర్తించారు. మరో ఘటనలో ఓ ప్రయాణికుడు తన నడుముకు ధరించే బెల్ట్కు బంగారాన్ని అతికించాడు. మరో వ్యక్తి తన రహస్య భాగాల్లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు మంగళూరు ఎయిర్పోర్ట్లో రూ.90.67 లక్షల విలువ గల 1606 గ్రాములు పుత్తడిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.