Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్ సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. అయితే భూకంపం ధాటికి పాకిస్థాన్లోని ఖైబర్ ఫంక్తున్ఖ్వా ప్రావిన్స్లో ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. భూకంపం వల్ల ఖైబర్ ప్రావిన్స్లో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారని పాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికార ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు. ప్రకృతి విపత్తులో గాయపడినవారు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో హిందూకుష్ పర్వతాల్లో భూకంపం వచ్చింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్లో భూమి కంపించింది. ఢిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఇండ్లు, భవనాలు కదిలాయని, భయంతో రోడ్లపైకి పరుగులు పెట్టామని ప్రజలు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండ్లలో ఫ్యాన్లు, వస్తువులు ఊగుతున్న వీడియోలను మరికొంతమంది షేర్ చేశారు.