Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ జరిగింది. బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఏటీఎం రిపేర్ చేసేందుకు వచ్చిన ఓ దొంగ ఏకంగా నగదుతో ఉడాయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్త సాయిబాబా గుడి రోడ్డులోని ఓ ఏటీఎం చెడిపోవడంతో బ్యాంకు సిబ్బంది.. ఏటీఎం రిపేర్ చేసే కంపెనీకి పోన్ చేశారు. కాసేపటి తరువాత ఏటీఎం రిపేర్ కంపెనీ ఉద్యోగినంటూ ఓ వ్యక్తి బ్యాంకులో ప్రత్యక్షమయ్యాడు. ఏటీఎంకు మరమ్మతులు చేసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక బ్యాంకు సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది. ఏటీఎం నగదులో రూ.50 వేల మేర తక్కువగా ఉన్నట్టు గుర్తించి దిమ్మెరపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆగంతుకుడి జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.