Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రైలు ఎక్కుతుండగా స్టేషన్లో జారిపోయిన చెప్పును రైల్వే అధికారులు జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రయాణికుడికి అప్పగించారు. వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కాజీపేట జంక్షన్లో జరిగిందీ ఘటన. జనగామ జిల్లా చిలుపూరు మండలం పల్లగుట్టకు చెందిన రాజేశ్ (25) సికింద్రాబాద్ వెళ్లేందుకు శనివారం స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. అక్కడ కదులుతున్న రైలు ఎక్కే సమయంలో రాజేశ్ చెప్పు ఒకటి జారి పట్టాలపై పడిపోయింది. రైలెక్కిన తర్వాత ఆ విషయాన్ని రాజేశ్ ట్వీట్ చేశాడు. ఆ చెప్పులు కొత్తవని, అవంటే తనకు ఎంతో ఇష్టమని ట్వీట్ చేస్తూ రైల్వే అధికారులను ట్యాగ్ చేశాడు.
ఈ ట్వీట్ చూసి స్పందించిన సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత స్పందించారు. వెంటనే కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు విషయం చెప్పి చెప్పును వెతికించారు. పట్టాలపై పడిన చెప్పును గుర్తించిన కానిస్టేబుల్ దానిని కాజీపేట స్టేషన్లో అప్పగించాడు. నిన్న ఈ చెప్పును అక్కడే రాజేశ్కు అందించారు. పోయిందనుకున్న చెప్పు తిరిగి దొరకడంతో రాజేశ్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.