Authorization
Wed April 30, 2025 11:07:19 am
నవతెలంగాణ - హైదరాబాద్: మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడ మీదుగా అంతర్గత కర్ణాటక, తమిళనాడు వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. దీంతో మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన జనం రెండు రోజులుగా కురుస్తున్న జల్లులతో ఉపశమనం పొందుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్లోని జీడిమెట్ల, గాయత్రీ నగర్లో అత్యధికంగా 3.3సెం.మీలు, గోల్కోండ, లంగర్హౌస్ ప్రాంతంలో 2.3సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.