Authorization
Wed April 30, 2025 10:28:38 am
నవతెలంగాణ - పాకిస్తాన్: మాజీ ప్రధాన మంత్రి తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా భారత్ లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ ని పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దురదృష్టవశాత్తు తన ప్రభుత్వం పడిపోవడంతోనే అది జరుగలేదన్నారు. అదీగాక పాకిస్తాన్ ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ తగ్గింపు రేటుతో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోంది. అలా తన దేశం కూడా కొనుగోలు చేయగలదా అంటూ విచారం వ్యక్తం చేశారు. పాశ్చాత్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తమ దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ది చేసే దిశగా రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్ ముందుకు వచ్చిందంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. అంతేకాదు.. యూఎస్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయాలన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు.