Authorization
Thu May 01, 2025 10:39:50 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ గిరిజన జాతిని నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ గిరిజన విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం పోస్టర్ను హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. తెలంగాణ గిరిజనులకు సంబంధించిన కీలక అంశాలైన 10 శాతం రిజర్వేషన్ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి ఆమోదించడం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం ఈ రెండు అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వెంటనే ఆమోదించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గిరిజన విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డులు రాసి పంపడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, రాష్ట్రంలోని గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రంలోని గిరిజనులు నష్టపోకుండా 10 శాతం రిజర్వేషన్ అమలు చేసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారని మంత్రి స్పష్టం చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడంతో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. విభజన చట్టం 2014 ప్రకారం కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పాఠశాల మొదలుకొని యూనివర్సిటీ వరకు ప్రతి గిరిజన విద్యార్థి పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారామ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ రాథోడ్, ప్రొఫెసర్ రమణ నాయక్, బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి నాయకుడు శ్రీను నాయక్, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.