Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది. అదే సమయంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పార్టీల జాతీయ హోదాను ఈసీ ఉపసంహరించుకున్నది. వాస్తవానికి ఓ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లైనా వచ్చి ఉండాలి.
నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. లేదంటే దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాల్లో విజయం సాధించి ఉండాలి. ఈ రెండుశాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నా జాతీయ పార్టీగా గుర్తిస్తారు. అయితే, మూడు పార్టీల జాతీయ హోదా రద్దవగా.. కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఐదు సీట్లు గెలిచింది. ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉన్నది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 6.8 శాతం ఓట్లు ఓట్లు దక్కాయి. అదే సమయంలో ఇద్దరు అభ్యర్థులు సైతం గెలుపొందారు. ఈ క్రమంలో పార్టీకి జాతీయ హోదాను కట్టబెట్టింది. దేశంలో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నా కొద్ది పార్టీలకు జాతీయ హోదా ఉన్నది. ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) పార్టీకి సైతం జాతీయ హోదా ఉన్నది. ఎన్పీపీ పార్టీకి 2019 జూన్ 7న జాతీయ హోదా లభించింది.