Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని అతని సహాయకులు రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నట్లుగా ఉన్న ఆ దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రోగి రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటనపై నిజానిజాలు తెలిసేలా విచారణ జరిపి, తక్షణమే నివేదిక అందజేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను ఆదేశించారు. కాగా, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వీడియోపై నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందిని విచారించినట్లు తెలిపారు. వీల్ఛైర్ తీసుకొచ్చేలోపు లిఫ్ట్ రావడంతో రోగి తల్లిదండ్రులు అతని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని చెప్పారు. ఇది చూసి సిబ్బంది వారించి.. వీల్ఛైర్లో తీసుకెళ్లారని స్పష్టం చేశారు. ఇదంతా తెలియక ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియకుండా ఇలాంటి వీడియోలు తీసి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోగొట్టేలా చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆస్పత్రిపై దుష్ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.