Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ రాసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ పరీక్షలు 13 భాషల్లో రాసే వెసులుబాటు కల్పించడంపై కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది ఉద్యోగార్థులకు మేలు జరుగుతుందని వెల్లడించారు.
ఇటీవల కేంద్రం సీఆర్పీఎఫ్ లో 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మన్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, నియామక పరీక్ష ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై పలు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. హిందీలో రాసే వెసులుబాటు ఉండడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల వారికి లబ్ది చేకూరుతుందని, దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు నష్టపోతారని పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ కూడా దీనిపై ట్వీట్ చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, కేంద్రం సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ ను సవరించింది. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించింది.