Authorization
Tue April 29, 2025 07:29:26 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రేపు (ఏప్రిల్ 22) రంజాన్ పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన ద్వారా స్పందించారు. సత్య నిష్ఠ, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగించుకుని, ఈదుల్ ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న వారందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ఉపవాసాలు, నిత్య ప్రార్థనలతో ముస్లింల లోగిళ్లన్నీ ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంటాయని వివరించారు. మానవత్వ విలువలను ద్విగుణీకృతం చేయాలని చాటిచెప్పే హితవచనాలు మానవాళి మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, రంజాన్ పండుగలో భారతదేశంలో మత సామరస్యం వెల్లివిరుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులలో ముస్లింలతో పాటు ఇతర మతస్తులు అధికంగా పాల్గొనడం మనం భారతదేశంలో మాత్రమే ఎక్కువగా చూస్తామని పవన్ తెలిపారు. దేశంలోనూ, ప్రపంచమంతటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ, ఇస్లాంపై నమ్మకం ఉన్నవారందరికీ తన తరఫున, జనసేన తరఫున ఈద్ ముబారక్ అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.