Authorization
Sun April 13, 2025 01:31:32 pm
నవతెలంగాణ - విజయవాడ: ఆర్-5 జోన్కు వ్యతిరేకంగా జై భీమ్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్కుమార్ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. ‘న్యాయం కోసం నేను సైతం’ పేరిట శనివారం విజయవాడ నుంచి అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం వరకు పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించారు. ఉదయం విజయవాడ నుంచి బయల్దేరేందుకు సిద్ధమవుతుండగానే శ్రావణ్ బస చేసిన హోటల్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరిని శ్రావణ్కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామని.. పోలీసులు అన్యాయంగా తనను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అక్రమ అరెస్ట్కు నిరసనగా ఆమరణదీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. తనను పోలీస్స్టేషన్లో ఉంచినా.. జైల్లో పెట్టినా.. ఎక్కడికి తీసుకెళ్లినా దీక్ష కొనసాగుతుందని శ్రావణ్ స్పష్టం చేశారు. రైతులకు మద్దతివ్వడమే తాను చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు.