Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు, నాలుగేండ్ల ప్రాయంలో ఉన్న పిల్లాడిని తన తండ్రి భుజం మీద ఎత్తుకుని తోటకు తీసుకువెళ్ళాడు ఒకనాడు. తండ్రి తన స్నేహితుడితో ముచ్చటిస్తూ, కొంత సమయం గడిచాక ఏమి చేస్తున్నాడో అని పిల్లాడి వైపు చూశాడు. ఆడుకుంటాడులే అనుకున్న ఆ పిల్లవాడు భూమిలో గడ్డిపరకలు నాటుతున్నాడు. ఏమి చేస్తున్నావురా నాన్న అని అడిగితే చిన్న చిన్న తుపాకీ మొక్కలు నాటుతున్నాను, అవి పెరిగి పెద్దపెద్ద తుపాకులు కాస్తాయి. వాటితో ఇంగ్లీష్ వాళ్ళను చంపి దేశానికి స్వాతంత్రం తీసుకువస్తా అంటూ ఆ పిల్లాడు తలెత్తకుండా సమాధానం చెప్పాడు. ఆ పిల్లవాడి మాటలకు ఆ తండ్రి మిత్రుడు ఐదునిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. మూడు, నాలుగు సంవత్సరాల వయసు లోనే తుపాకీ పట్టాలని భావించిన ఆ పిల్లాడే తరువాతి కాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన భారత విప్లవోద్యమ నాయకుడు షహీద్ భగత్సింగ్.
పదమూడేండ్ల వయసులోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి భగత్సింగ్ ప్రభావితుడయ్యాడు. అయితే ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా గ్రామస్తులపై బ్రిటిష్ పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది నిరాయుధులైన రైతులు ప్రాణాలను కోల్పోయారు. దానికి ప్రతిగా గ్రామస్తులు తిరగబడి ఆ పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టి తగలబెట్టారు. ఆ స్టేషనులో ఉన్న పోలీసులు కొందరు మాడి మసి అయినారు. ఈ సందర్భంగా అహింసావాది అయిన గాంధీ, హింసాయుతమైన ఆ గ్రామస్తుల తిరుగుబాటును అపరాధంగా భావించి తాను చేపట్టిన సహాయ నిరాకరణోద్యమాన్ని అర్థంతరంగా నిలిపివేశారు. దానికి అసంతృప్తి చెందిన భగత్సింగ్ విప్లవమార్గం పట్టాడు.
గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నాక దేశంలో హిందూ ముస్లింల మధ్య తలెత్తిన సంఘర్షణలను భగత్సింగ్ కండ్లారా చూశాడు. అప్పటినుండి విప్లవకారుల స్వతంత్ర ఉద్యమానికి మతం అడ్డుగోడగా నిలుస్తుందని గ్రహించిన భగత్సింగ్, ఆ క్షణం నుండే మతోన్మాదాన్ని నిరసించారు.
1928లో భారతదేశంలోని రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను వేసింది. ఆ కమిషన్లో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేకపోవటంతో దేశవ్యాప్తంగా సైమన్ గోబ్యాక్ అనే నినాదాలు, నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబర్ 1928న ఆ కమిషన్ లాహౌర్ని సందర్శించినప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాలాలజపతిరారు (పంజాబ్ కేసరి) నాయకత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆ నిరసనను బ్రిటిష్ పోలీసులు హింసాయుతంగా మార్చారు. లాలాలజపతిరారు మీద అత్యంత క్రూరంగా లాఠీఛార్జి చేసి చాతిమీద విపరీతంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన లాలాలజపతిరారు మరణించాడు. ఈ సంఘటనను కండ్లారా చూసిన భగత్సింగ్ చలించిపోయాడు. దెబ్బకు దెబ్బ తీసి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. లాలాలజపతిరారు హత్యకు కారణమైన పోలీస్ అధికారి ''స్కాట్''ను ఎలాగైనా మట్టుపెట్టాలని విప్లవకారులు శివ రామ్, రాజ్ గురు, జై గోపాల్, సుఖదేవ్ థాపర్లతో పథకం వేశాడు. ''స్కాట్''ను గుర్తించిన జైపాల్ ఆయన్ను కాల్చమంటూ భగత్సింగ్కు సంకేతాలు ఇచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా ''స్కాట్''కు బదులు జేపి సాండర్స్ హతమయ్యాడు. పోలీసుల కంటపడకుండా లాహౌర్కి వెళ్లి అజ్ఞాత జీవితం గడిపాడు భగత్సింగ్.
విప్లవకారుల చర్యలను కర్కశంగా అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది. భగత్సింగ్ లాంటి విప్లవకారులను అణచటం ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర శాసనసభపై బాంబు వేయాలని సామ్యవాద గణతంత్ర యువజన సంఘం వ్యూహరచన చేసింది. భగత్సింగ్తో పాటు సహవిప్లవ కారుడు దత్ 8 ఏప్రిల్ 1929న శాసనసభ వసారాపై బాంబు విసిరి ''ఇంక్విలాబ్ జిందాబాద్'' (విప్లవం వర్థిల్లాలి) అని గొంతెత్తి నినదించారు. ఈ దాడి అనంతరం ఇద్దరూ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు.
జేపీ సాండర్స్ హత్య కేసులో భగత్సింగ్, రాజ్ గురు, సుఖదేవ్లను అరెస్టు చేసి బ్రిటిష్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. విచారణలో భాగంగా దేశ స్వాతంత్రం కోసం తన గళాన్ని వినిపించడానికి న్యాయస్థానాన్ని ఒక ప్రచార వేదికగా మలుచుకున్నాడు భగత్సింగ్. హత్యా నేరాన్ని అంగీకరించిన భగత్సింగ్... బ్రిటిష్ ప్రభుత్వం తన దేశాన్ని, దేశ ప్రజలను ఎలా దోచుకుంటున్నదో, సామాన్య ప్రజానీకం యొక్క నిరసన గళాలను ఎలా నిర్థాక్షిణ్యంగా అణచి వేస్తుందో చెబుతూ న్యాయస్థానంలో పలు ప్రకటనలు చేశాడు. న్యాయస్థానం ఆ ముగ్గురికి ఉరిశిక్ష ఖరారు చేసింది.
జైలులో ఉండగా భగత్సింగ్ ఇతర ఖైదీల హక్కుల గురించి పోరాడాడు. రాజకీయ ఖైదీలకు అందరికీ సరైన ఆహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, సరైన మరుగుదొడ్లు, ఇతర దైనందిన సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లతో దీక్షను చేపట్టాడు. అరవై మూడు రోజుల పాటు కొనసాగిన నిరాహార దీక్షతో బ్రిటిష్ ప్రభుత్వం లొంగిరాక తప్పలేదు. దీనితో భగత్సింగ్కు సాధారణ భారతీయుల్లో మరింత ఆదరణ పెరిగింది.
జైలులో ఉన్నప్పుడు కూడా భగత్సింగ్ నిత్య అధ్యయనశీలిగా ఉండేవాడు. రష్యాలో బోల్షివిక్ విప్లవం జయప్రదం అవ్వటంతో దాని వెలుగులో యూరప్ ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేశాడు. జైల్లో ఉండగానే మార్క్స్, ఎంగిల్స్, లెనిన్లు రచించిన అనేక గ్రంథాలను, వాటితో పాటు రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం సామాజిక శాస్త్రాలను చదివాడు. జైలు అధికారులు నీ ఆఖరి కోరిక ఏమిటి? అని అడిగినప్పుడు నేను లెనిన్ జీవిత చరిత్ర చదువుతున్నాననీ, నేను చనిపోయేలోగా దానిని పూర్తి చేయాలని కోరుకుంటున్నాననీ చెప్పాడు. ఇవన్నీ తన లిఖిత పత్రాల్లో పేర్కొన్నాడు.
మార్క్సిజం అధ్యయనంతో భగత్సింగ్ ఎక్కువగా ప్రభావితుడయ్యాడు. భారత దేశంలో ప్రథమ మార్క్సిస్టులలో భగత్సింగ్ ఒకరిని ప్రముఖ భారత చరిత్రకారుడు కె.ఎన్. ఫణిక్కర్ అభివర్ణించాడు. 1931లో జైలులో ఉండగా నాస్తికవాద తత్వాన్ని వివరిస్తూ ''నేనెందుకు నాస్తికుడనయ్యాను'' అనే శీర్షికతో ఒక వ్యాసం రాశాడు. సర్వశక్తి సంపన్నుడు అని పిలవబడుతున్న దేవుడి పట్ల తనకు విశ్వాసంలేదని ప్రకటించాడు. ఇతరుల హృదయాలకు దగ్గరగా ఉండే కల్పిత గాధలు, మూఢవిశ్వాసాలను నమ్మే స్థితికి తాను దిగజారబొనని స్పష్టం చేశాడు. నిరూపితం కాని దైవత్వం కేవలం మానవ బలహీనతకు సంకేతమని తన వ్యాసంలో పేర్కొన్నాడు.
తనను ఉరి తీయడానికి నాలుగు రోజుల ముందు తన మిత్రుడైన ప్రసన్న మెహతా జైలులో భగత్సింగ్ను కలిసి క్షమాభిక్షముసాయిదాపై సంతకం చేయమని కోరాడు. భగత్సింగ్ క్షణం కూడా ఆలోచించకుండానే సంతకం చేయడానికి నిరాకరించాడు. బాధతో ప్రసన్న మెహతా భగత్సింగ్ యొక్క పట్టుదలను చూసి వెనుదిరిగి వెళ్లిపోయాడు.
23 మార్చి 1931న భగత్సింగ్తో పాటు ఆయన సహచరులు రాజ్ గురు, సుఖదేవ్లను లాహౌర్ జైల్లో ఉరితీశారు. సాధారణంగా ఉదయం ఎనిమిది గంటలకు ఉరి తీస్తారు. కానీ, ఏమి జరుగుతుందో ప్రజలు తెలుసుకునేలోపే రాత్రి 7గంటల సమయంలో ఉరి తీశారు. ఆ జైలు లోపల నుండి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలు బిగ్గరగా వినిపించాయి. జీవితానికి చివరగా తెరదించ బోతున్నారు అన్న దానికి ఇది సంకేతం అయింది. ''మేం జీవితాన్ని ప్రేమిస్తాం. మరణాన్ని ప్రేమిస్తాం, మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం. నిప్పు రవ్వల మీద నిదురిస్తాం'' అన్న ఆ మహా యోధులు భరత మాత కన్న ముద్దు బిడ్డలు.
- పి.బి. చారి
సెల్:9704934614