Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ సామాజిక సమస్యల పరిష్కా రం కోసం 95ఏండ్ల క్రితం అంబేద్కర్ నాయకత్వంలో మనుస్మృతి దహనం చేయబడిందో ఆ సమస్యలు యిప్పటికీ సజీవంగానే ఉంటూ తీవ్రమవుతున్నాయి. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్ పేరుతో చేస్తున్న చట్టాలు కింది కులాల యువకులుపై కులాల యువతులను ప్రేమించి పెండ్లిళ్లు చేసుకోకుండా నిషేధించడం కోసమే. నేడు దేశంలో మహిళలపై మానభంగాలు, హత్యలు మరింత పెరిగాయి. పసిపాపలను కూడా బలాత్కరించి చంపేయడం నేడు మన కండ్ల ముందు కనబడుతున్న దౌర్భాగ్యం. ఇవన్నీ కేవలం శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలే కాదు. ఒక దుర్మార్గమైన, అనాగరికమైన భావజాలానికి చెందిన ప్రభావాలు. దళితులు, మహిళలు, బలహీనవర్గాల వారిని అనుభవించి, అణిచివేసి, హత్యలు చేయవచ్చనేది మనుస్మృతిలోనే దాగి ఉన్న కుట్ర. నేడు కేంద్రంలో మనుస్మృతి ఆరాధకుల అసాధారణ పరిపాలన సాగుతున్న నేపథ్యంలో ఈ మనువాద వ్యతిరేక పోరాటానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ డిసెంబర్ 25న ''మనుస్మృతి దహన్ దివాస్''కి లభించిన స్పందన ఈ ప్రాధాన్యతను మరింత రుజువు చేస్తోంది.
1927 డిసెంబర్ 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్, అతడి అనుచరులు మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతం రాయగడ్ జిల్లాలోని మహద్ అనే చిన్న పట్టణంలో కొన్ని వేల మంది సమక్షంలో మనుస్మృతిని దహనం చేసారు. ఈ సందర్భంగా ''చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించం, కుల వ్యత్యాసాలను అంగీకరించం, హిందూ సమాజానికి శాపంగా ఉన్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాం, ఆహారం, పానీయం విషయాల్లో ఎలాంటి నిషేధాలను పాటించం, ఆలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వగైరా సదుపాయాల విషయంలో అశ్పృస్యులు అనబడే వారితో సహా అందరికీ సమాన హక్కులు ఉంటాయని నమ్ముతున్నాం'' అని ప్రతిజ్ఞ చేశారు. మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్లోని ఒక ఊర చెరువు నుండి దళితులను తాగునీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేద్కర్ నేతృత్వంలో ఒక గొప్ప సత్యాగ్రహం జరిగింది. అంతకుముందు ఆ పట్టణంలో హిందువులు నడిచే వీధులపైన అంటరానివారైన కారణంగా దళితులు నడిచేందుకు కూడా వీల్లేదని అగ్రవర్ణాలవారు నిషేధం విధించారు. ప్రభుత్వం నిర్మించి, నిర్వహించే అన్ని ప్రదేశాలకూ దళితులు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని, మునిసిపల్ రోడ్లపై అందరూ నడవ వచ్చని, చెరువులో నుండి నీరు తెచ్చుకోవచ్చని అప్పటి బొంబయి ప్రావిన్స్ శాసనమండలి 1923లో తీర్మానం చేసిన తరువాత, మహద్ మున్సిపల్ కౌన్సిల్ కూడా శాసనమండలి తరహాలో 1924లో మరో తీర్మానం చేసింది. అయితే అక్కడ అగ్రవర్ణాల నిరసన కారణంగా ఈ తీర్మానాలేవీ అమలుకు నోచుకోలేదు. దీంతో అంబేద్కర్ బహిష్కృత హితకారిణి మహాసభను 1927 మార్చి 19, 20 తేదీలలో మహద్లోనే నిర్వహించారు. వెయ్యి మందికిపైగా ఈ సభకు హాజరయిన ప్రతినిధులు సభ తర్వాత ఊరేగింపుగా వెళ్లి అదే ఊర చెరువులో మంచినీరు తాగారు. దళితులు ఆ చెరువు నుండి నీరు తీసుకుని తాగడంతో అది అపవిత్రమైపోయిందని భావించిన సవర్ణ హిందువులు చెరువు నీటిని శుభ్రపరిచి, ఆ చెరువుకు ప్రక్షాళన పూజలు నిర్వహించారు. అమానవీయమైన ఈ మనువాదం పట్ల గల నిరసనభావాన్ని తెలిపేందుకు అంబేద్కర్ ఈ మనుస్మృతి దహన కార్యక్రమాన్ని చేపట్టారు.
అయితే అంబేద్కర్ ఈ ఉద్యమం తాగునీటి కోసం, ఆలయ ప్రవేశం కోసం, ఇతర సదుపాయాల కోసమే కాదు, సమాజంలో అసమానతలకు హేతువైన వర్ణ వ్యవస్థను రూపుమాపడం కోసమే చేస్తున్నామని వివరించారు. మౌలిక సమస్యలపై కేంద్రీకరించకుండా స్వల్పకాలిక, తాత్కాలిక సమస్యలకే పరిమితం కావడం వలన విముక్తి లభించదని బోధించారు. కాబట్టి మా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నాం, ఈ సామాజిక విప్లవానికి సహకరించండని అగ్ర వర్ణాలకు కూడా అంబేద్కర్ విజ్ఞప్తి చేసారు. ''శాస్త్రాలను వదిలేయండి, న్యాయాన్ని చూడండి'' అని హితవు పలికారు. మనుస్మృతి దహనం, మహద్ చెరువులోని నీరు తెచ్చుకోవడం సమస్య తీవ్రతను గుర్తింపచేసి, నిరసన వ్యక్తం చేసే సింబాలిక్ చర్యలు మాత్రమేనని, వాటి పరిష్కారానికి సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని అంబేద్కర్ దిశా నిర్దేశం చేశారు. కాబట్టి మనుస్మృతి దహనం అనేది కేవలం దళితులకు సంబంధించిన కర్తవ్యమే కాదు. నేటి మహిళలు, మైనారిటీలు, బలహీన వర్గాల వారంతా ఈ మనుస్మృతికి బలిపశువులేనని గుర్తించాలి. మనుస్మృతి వలన దళితులు అనుభవించిన అమానుష బానిసత్వం, సామాజిక అన్యాయం అందరికీ తెలిసిందే. దళితుల నివాసాలు ఊరికి దూరంలో వెలివాడలుగా ఉండే విషయం ఇప్పటికీ షరా మామూలే. ఒకప్పుడైతే దళితుడి అడుగు జాడలు బజారులో పడకూడదు. అందుకోసం నడుముకు వెనక పొడవుగా గుబురుగా ఆకులు ఉండే కొమ్మలను లేదా తాటి మట్టలను కట్టుకోవాలి.అవి వెనక నేలపై ఈడ్చుకొస్తూ పాదముద్రలను చెరిపేయాలి. అలాగే ఊరిలో ఎక్కడా ఉమ్మి కూడా వేయకూడదు. అందుకోసం మెడలో చిన్న ముంత కట్టుకొని ఉమ్మి వచ్చినప్పుడు అందులోనే ఉమ్మాలి. అదే విధంగా దళితులు ఎలాంటి ఆయుధాలను ఉంచుకోకూడదు, విద్య నేర్చుకోకూడదు, చదువుకోకూడదు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలకు, హత్యలకు గురి కావాల్సిందే. ఈ అమానుషాలపై అంబేద్కర్ లాంటి నేతల కృషి, అనేక సామాజిక పోరాటాల ఫలితంగా కొంత మార్పు వచ్చినా... తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం బీజేపీ అధికారంలోకి వచ్చాక వేగం పుంజుకుంది. ''న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి'' అనేది మనుస్మృతి ఆదేశం. బాలికగా తండ్రి రక్షణలో, మహిళగా భర్త రక్షణలో, విధవగా కొడుకు రక్షణలో మహిళ ఉండాలని మనుస్మృతి కట్టడి చేస్తోంది. మహిళ లను బానిసలుగా చూసే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. నేడు దేశంలో మనువాదుల పాలనే సాగుతున్న కాలంలో ఈ భావజాలం తిరిగి జడలు విప్పుతోంది. అంబేద్కర్ స్ఫూర్తితో అప్ర మత్తమయి ఈ మనువాదులను ప్రతిఘటించకపోతే రానున్నది మహా ప్రమాదమే.
- నాదెండ్ల శ్రీనివాస్
9676407149