Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం జన్మదినోత్సవం సందర్భంగా కాలి నడకన తిరుమలకు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయనే నేరుగా జాతీయ స్థాయిలో సేవలందిస్తానని చెప్పిన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఏదీ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కవిత గురువారం హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుపతికి బయల్దేరి వెళ్లిన ఆమెకు అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కడి వృద్ధాశ్రమాన్ని ఆమె సందర్శించారు. ఆ తర్వాత కాలినడకన తిరుమలకు బయల్దేరారు. సాయంత్రానికి కొండ మీదకు చేరుకున్న ఆమె.. భర్తతో అనిల్తో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలోని 105 అసెంబ్లీ సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ... టీఆర్ఎస్ను విమర్శించటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన ఆ పార్టీ నేతలు... తమ ప్రభుత్వాన్ని విమర్శించటం తగదని హితవు పలికారు.