Authorization
Sat May 17, 2025 02:27:02 am
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
'నమో అంటే నరేంద్ర మోడీ కాదని.. నమ్మించి మోసం చేసేవాడని' టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటించారు. తంగళ్ళపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలకు హాజరుకుండా ఇతర పనులు పెట్టుకునే వారు పార్టీకి రామ్రామ్ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్పంచులు మొదలుకొని జెడ్పీ చైర్పర్సన్ల వరకు దాదాపు అందరూ టీఆర్ఎస్ వారే ఉన్నారన్నారు. పార్టీకి ఉన్న 60లక్షల మంది కార్యకర్తల కృషి వల్లే పదవుల్లో ఉన్నామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్.. పథకాలను ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ను విమర్శిస్తే జనగామ, ఆర్మూర్లో జరిగిన ఘటనలు సిరిసిల్ల గడ్డమీద పునరావృతమవుతాయని హెచ్చరించారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏదైతే చేస్తారో అలాంటి పథకాలనే భారత దేశమంతటా అమలుపరుస్తారనే భావన ఉండేదని.. నేడు తెలంగాణ రాష్ట్ర పథకాలనే దేశం మొత్తం అమలుకు ప్రయత్నిస్తున్నారన్నారు.