Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీయర్ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ-హైదరాబాద్/విలేకరులు
సమ్మక్క, సారక్కలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన జీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జీయర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య పార్కు వద్ద తెలంగాణ గిరిజన సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్ మాట్లాడుతూ.. మనువాద భావజాల వ్యాప్తిలో భాగంగానే కింది కులాల దేవతలను, ఆచారాలను, సంస్కృతిని, ఆహార అలవాట్లను కించపరిచే విధంగా చినజీయర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అహంకారానికి, మనువాద భావజాలానికి నిరదర్శనమ న్నారు. ఆదివాసీ గిరిజన ప్రజలు ఎంతో ఇష్టంతో ఆరాధించే సమ్మక్క- సారలమ్మలను అవమానించి గిరిజనులతో పాటు కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. జీయర్స్వామి వ్యాఖ్యలపై ఇంత నిరసన వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. చినజీయర్ స్వామి మరో దొంగ డేరా బాబాగా మారి భక్తి ముసుగులో వేల కోట్ల ప్రజాధనంతో సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారని విమర్శించారు. సాధారణ మతబోధకుడు అయిన రామానుజంను దేవుడిగా చిత్రీకరించి 120 కిలోల బంగారంతో చైనాలో విగ్రహం తయారు చేయించి కోట్లాది రూపాయలు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.దశరథ్, రాష్ట్ర నాయకులు మహేందర్, జి.రాములు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, నాయకులు రమేశ్, వెంకన్న, కృష్ణ, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
చిన జీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పొల్యూట్ బ్యూరో మెంబర్ మైస రాములు మాదిగ, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనువాస్ గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న ఆధ్వర్యలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం చేశారు. వనపర్తి జిల్లాలోని అమరచింత, గద్వాల జిల్లాలోని అలంపూర్, మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండల కేంద్రాల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఆదివాసుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మను ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి చిత్రపటాన్ని దహనం చేశారు.