Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాధానం చెప్పాలంటూ బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోలపై నాటకాలడితే ప్రజలు గ్రహించలేరా? బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మోసాలను తెలుసుకోలేరా? అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. యాసంగి సీజన్లో ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం రా రైస్ కిందికే వస్తుందనీ, అలా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సోమవారం సీఎం కేసీఆర్కు పది ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ ప్రభుత్వం సోమవారం ఢిల్లీలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ నుంచి ఇక బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు? అని నిలదీశారు. ఇప్పుడు ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే రైతులు మీ రెండు పార్టీల మోసాలను గ్రహించలేరా? అని అడిగారు. 'ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల కారణంగా రూ 7500 కోట్లు నష్టం వచ్చినట్టు చెప్పి...ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన చేయలేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాల కారణంగా ఇప్పటికీ దళారుల చేతుల్లో రైతులు నష్టపోతున్న విషయం నిజం కాదా? ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిస్సహాయ స్థితిలో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకుంటున్నారు' అని ప్రశ్నలు సంధించారు. వీటన్నింటిని సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.