Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరితగతిన అనుమతుల్విండి..పనులు పూర్తిచేయండి
- అటవీ, గిరిజనసంక్షేమం, విద్యుత్ శాఖ సమన్వయ సమావేశంలో ఉన్నతాధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న అటవీ ఆవాసాలకు తక్షణమే విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలనీ, పనులకు త్వరితగతిన అనుమతులిచ్చి పూర్తిచేయాలని అటవీ, గిరిజన సంక్షేమ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్లోని అరణ్యభవన్లో ఆ శాఖల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం జరిగింది. సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 232 ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సదుపాయం కల్పించాల్సి ఉందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తు తెలిపారు. నిబంధనల మేరకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు అటవీ శాఖ వేగంగా స్పందిస్తున్నదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. రక్షిత అటవీ ప్రాంతాలకు బయట యాభై (50)ఆవాసాలున్నాయని సంబంధిత జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అనుమతితో పనులు మొదలు పెట్టొచ్చన్నారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో 182 (అదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో) ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం అందించాల్సి ఉందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు పీసీసీఎఫ్లు మోహన్ చంద్ర పర్గెయిన్, ఏకే. సిన్హా, సంబంధిత జిల్లాలకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, టైగర్ రిజర్వు కేంద్రాల ఫీల్డ్ డైరెక్టర్లు, జిల్లాల అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.