Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు
- 31న ఇందిరాపార్క్ వద్ద ధర్నా : వామపక్ష పార్టీల పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈనెల 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆయా పార్టీల సమావేశాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో తమ్మినేని వీరభద్రం, డిజి నరసింహారావు (సీపీఐఎం), ఎన్ బాలమల్లేష్ (సీపీఐ), రమ, హన్మేష్ (సీపీఐఎంఎల్ ప్రజాపంథా), కె గోవర్ధన్ (సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ), జెవి చలపతిరావు (సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ), మురహరి (ఎస్యుసీఐ(సీ), జానకిరాములు (ఆరెస్పీ), బి సురేందర్రెడ్డి (ఫార్వర్బ్లాక్), జి రవి (ఎంసీపీఐ), రాజేష్ (సీపీఐ(ఎంఎల్) లిబరేషన్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు బుధవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతోపాటు, భూముల రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలపై సమావేశం చర్చించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు మూడు విడతలుగా ఆందోళనా పోరాటాలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈనెల 27న మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, ధర్నాలు, 30న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు, 31న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నా చేపట్టనున్నట్టు వివరించారు. ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని వామపక్షశ్రేణులు, ప్రజాసంఘాలు, మేధావులకు, ప్రజాతంత్రవాదులు, ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్, పప్పులు, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాయని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై కేంద్రం విధించిన అన్ని రకాల సెస్సులనూ రద్దుచేసి, ఎక్సైజ్ సుంకం తగ్గించాలనీ, పెంచిన వంట గ్యాస్, నిత్యావసరాల ధరలతోపాటు, బట్టలు, చెప్పులపై జీఎస్టీని తగ్గించాలనీ, స్టీల్, సిమెంట్, ఇసుక ధరలను అదుపు చేయాలనీ, దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసరాలు పేదలకందించాలని డిమాండ్ చేశారు. అసంఘటితరంగ కార్మికులందరికీ నెలకు రూ.7,500లు ఇవ్వాలనీ, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి, దీన్ని పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని కోరారు. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలనీ, అసంఘటిత కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలు చెల్లిం చాలని తెలిపారు. పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్సు, భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.