Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదరికమే ఆసరాగా చేసుకుని యాజమాన్యాల దోపిడీ
- పని ప్రదేశాల్లో అవస్థలు.. ప్రమాదపు అంచుల్లో జీవనం
- మానవత్వం మరిచిన పెట్టుబడిదారులు
- 12 గంటల పనిదినం అమలు చేస్తున్న యాజమాన్యాలు
- పారిశ్రామిక వాడల్లో కార్మికులు గోస వర్ణనాతీతం
''పేదరికాన్నీ ఆసరగా చేసుకుని కంపెనీల యజమాన్యాలు మా శ్రమను దోచుకుంటున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేసిన గంటకు రూ. 20 నుంచి రూ.30 వేతనమే ఇస్తున్నారు. నెలలో ఒక రోజు తప్పిన వేతనంలో కోత తప్పదు.. ఇదేందని అడిగితే మారుసటి రోజు ఉద్యోగం ఊడుతుంది. బయట ఉపాధి లేక పూటగడుపుకోవడానికి గుండె రాయి చేసుకుని బతుకుతున్నాం. మా గోస ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. మా కష్టాలకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశలు లేకుండా మా జీవితాలు కంపెనీల యజమాన్యాల చేతుల్లో నలిగిపోతున్నాయి. పొట్టకూటికి వచ్చినం.. కడుపు మాడ్చుకుని పస్తులుండాల్సి వస్తోంది' బతుకుదెరువు కోసం వలస వచ్చి పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కార్మికుల గుండె గోస.. ఇది
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కార్మికులు దాదాపు లక్ష మంది (కార్మిక శాఖ లెక్కల ప్రకారం) పనిచేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించని వారు మరో 50వేల మంది వరకు ఉన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 80 శాతం ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వారే ఎక్కువ. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ నుంచి బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని వచ్చారు. ఆ వలస కార్మికుల పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు రోజుకు 12 గంటల పాటు పని చేయించుకుంటూ రోజుకు రూ. 250 చెల్లిస్తూ శ్రమను దోచుకుంటున్నారు. చేసిన పనికి ఎప్పుడు డబ్బులు వస్తాయే కూడా తెలియని పరిస్థితి వారిది. పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులకు కడుపు మాడ్చుకోవడం తప్పడం లేదు. సొంత గ్రామానికి పోతే ఉపాధి దొరకక.. కుటుంబం పడుతున్న అవస్తలు చూడలేక ఇతర ప్రాంతాలకు వచ్చి పనులు చేసుకుందామంటే ఇక్కడ కూడా ఎక్కువ పనిచేయించుకుంటున్నారు తప్ప పనికి తగ్గ డబ్బులు ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక రక్షణ చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్టు వ్యవహరిస్తోంది. కంపెనీల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ కార్మికుల శ్రమను దోచిపెడుతుంది. ఇందుకు నిదర్శనం ''కోవిడ్-19తో ఉద్యోగం కోల్పోయిన ఒడిశాకు చెందిన షణుముఖ్ రావు రెండు నెలల కింద ఉపాధి కోసం తెలంగాణకు వచ్చాడు. జిల్లాలోని మహేశ్వరం ప్రాంతంలో రెసల్యూషన్ కంపెనీ థర్మకోల్, ఎలక్ట్రానిక్ టీవీల విడిభాగాల తయారీ కంపెనీలో లోడింగ్, అన్ లోడింగ్ హమాలీగా పనిలో కుదిరాడు. రెండు నెలలుగా రాత్రి, పగలు తేడా లేకుండా రోజుకు 12 గంటల నుంచి 14 వరకు పనిచేయించుకుంటున్న యజమాన్యం రోజు రూ. 300 వేతనం ఇస్తామని ఒప్పంద చేసుకుంది. కానీ రెండు నెలలయినా రూపాయి కూడా వేతనం ఇవ్వకపోవడంతో కార్మికుడు రోజుకు ఒక పూట భోజనంతో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాడు. పని వదిలి ఇంటికి పోదామంటే పోవడానికి ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇంటి నుంచి డబ్బుల కోసం ఫోన్లు చేస్తున్నారు. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. భార్య కుట్టుమిషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందని తెలిపారు. ఇక్కడికి వచ్చి పనిచేసి ఇంటికి డబ్బులు పంపిస్తానని ఆశతో వచ్చిన షణుముఖ్ ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని..ఇన్ని కావు. తల దాచుకోవడాని గూడు లేదు. కడుపు నింపుకోవడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇది ఈ ఒక కార్మికుడిదే కాదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులందరిదీ ఇదే పరిస్థితి.
'ఉత్తర ప్రదేశ్కు చెందిన సుదియ ఆరేండ్ల కింద భర్తతో పాటు ఉపాధి కోసం రాష్ట్రానికి వచ్చింది. వాటర్ ట్యాంక్ తయారీ కంపెనీలో భార్య, భర్తలు పనిచేస్తున్నారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తే ఇద్దరికి వచ్చే వేతనం రూ. 600 ఈ లెక్కన నెలకు రూ. 18 వేలు ఆదాయం వస్తోందనుకుంటే పొరపాటే.. ఆదివారాలు, సెలవు దినాలు జీతం కట్టు, ఆరోగ్యం బాగోలేక ఒక రోజు సెలవు పెట్టిన అదనంగా ఒక రోజు వేతనం కోత అన్ని పోను వారికి వచ్చేది నెలకు రూ. 15 వేలు మాత్రమే. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చాం కానీ, ఇక్కడ వచ్చే డబ్బులు తినడానికి కూడా సరిపోవడం లేదని వాపోతున్నారు. ఇక ఇంటికి ఏమి పంపాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ అధికారులు స్పందించి కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇచ్చే విధంగా చూడాలని కార్మికులు కోరుతున్నారు. దాంతో పాటు పనిభారం ఎక్కువగా ఉండకుండా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
పని ప్రదేశంలో రక్షణ కల్పించాలి
మిషన్ల వద్ద ఆపరేటర్లుగా పనిచేస్తున్న కార్మికులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎప్పుడు ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాంటి ప్రదేశాల్లో రక్షణ కల్పించాల్సి ఉన్నా ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కార్మికుల శ్రమకు తగ్గ వేతనాన్ని యజమాన్యాలు చెల్లించాలి. సకాలంలో వేతనాలు ఇవ్వాలి లేని పక్షంలో భవిష్యత్లో పారిశ్రామిక వాడల్లో కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలకు పిలుపునిస్తాం.
- కవిత, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు
శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి
కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని కంపెనీల యజమాన్యాలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. వెట్టి చాకిరీ చేయించుకుని చాలీచాలని వేతనాలు ఇస్తున్నాయి. కార్మికులను నిర్బంధాలకు గురి చేసి యజమాన్యాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కార్మికులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నా కార్మిక శాఖ అధికారులు, ప్రభుత్వం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తుంది.
- రవి, సీపీఐ(ఎం) మహేశ్వరం మండల కార్యదర్శి