Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విచ్ఛిన్నకర శక్తులు పేట్రేగితే సమాజ ఐక్యతకు పెనుముప్పు.మతఘర్షణలను కేంద్రం ప్రోత్సహించడం ప్రమాదకరం.బలమైన కేంద్రం- బలహీనమైన రాష్ట్రాలనేది 'కుట్రపూరిత సిద్దాంతం'.రాష్ట్రాల హక్కులను హరించటం మానుకోవాలి. కేంద్ర ప్రభుత్వం గుదిబండలా మారింది.ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాల్సిందే...
దేశంలో సమస్యలకు ప్రగతిశీల ఎజెండానే పరిష్కారం.
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం కేసీఆర్
- బీజేపీ సర్కార్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం మతఘర్షణలను ప్రోత్సహించడం అత్యంత ప్రమాదరకమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగిపోతే సమాజ ఐక్యతకు పెనుముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. 'బలమైన కేంద్రం- బలహీనమైన రాష్ట్రాలనేది కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత సిద్ధాంతమని విమర్శించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుదిబండగా మారిందన్నారు. వాటి హక్కులను కాలరాస్తున్నదనీ, అందులో భాగంగానే ఆర్థిక ఆంక్షలను విధించిందనీ, వాటిని వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యానీ, అనేక సమస్యలకు ప్రగతిశీల ఎజెండానే పరిష్కారమని తెలిపారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్లోని పబ్లిక్గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి కేంద్రం వసూలు చేస్తున్నదనీ, తద్వారా రాష్ట్రాలకు రావాల్సిన రూ లక్షల కోట్లను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నదని ఆరోపించారు. 'ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడి అప్పులు చేస్తున్నదని రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడే ఆర్థిక ప్రక్రియ నిర్వహిస్తూ...ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారైందని తెలిపారు. దీనిపై కేంద్రం వెంటనే పునరాలోచించాలనీ, రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం' అన్నారు.
మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదు
భారత దేశంతోపాటు స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నామని సీఎం ఈసందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదని విమర్శించారు. ప్రజల అవసరాల ప్రాతిపదిక కాకుండా మతఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమన్నారు. దేశంలో అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరి కదా ఉన్న పెట్టుబడులు కూడా వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనకకు తీసుకపోవడం ఖాయమనీ, దీన్నుంచి కోలుకోవడానికి మరో వందేండ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నదన్నారు. 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్య్రబాధ ఎందుకు పీడిస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి ఐదేండ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు...అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు...దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి అని అభిప్రాయపాడ్డారు. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలనీ, అందుకోసం దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించారు.
రైతుల మీద భారం వేసే చర్యలకు వ్యతిరేకం
కంఠంలో ప్రాణమున్నంత వరకు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడుతామని సీఎం కేసీఆర్ ఈ ంసదర్భంగా పునరుద్ఘాటించారు. కేంద్రానికి తలొగ్గి...రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలుచేయక పోవడం వల్ల మన రాష్ట్రం ఏటా రూ.5వేలకోట్లు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయిందన్నారు. 'బాయిలకాడ మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలనేది మన విధానం కాదు. రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు' అని స్పష్టం చేశారు.
అప్పుడు సమైక్య పాలకులు.. ఇప్పుడు తెలంగాణపై కేంద్రం వివక్ష
ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్న సమయంలో తెలంగాణపై సమైక్య పాలకులు వివక్ష చూపారనీ, స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని సీఎం ఆరోపించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ఈ వివక్ష ప్రారంభమైందనీ, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టిందని విమర్శించారు. దీంతో లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయామన్నారు.ఐదేండ్లపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశాన్ని ప్రగతిపథంలో పరుగులు
పెట్టించేందుకు తగు వేదికలు కావాలి
భారతదేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక,ఆర్థిక విధానాలు కావాలనీ, అందుకు తగు వేదికలు రావాలని అభిప్రాయపడ్డారు. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం ప్రయత్నించాలని కోరారు. 'నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు అని హెచ్చరించారు. ప్రజలకు కావాల్సింది కరెంటు, తాగునీరు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలేన్నారు. దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు.
నిటి ఆయోగ్ సిఫారసులూ బేఖాతర్
'మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నిటి ఆయోగ్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేసింది అని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తాను స్వయంగా ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని విమర్శించారు. కరోనాతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న రాష్ట్రాలకు నయాపైసా అదనంగా ఇవ్వలేదని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతోపాటు ఇతర ప్రాత్సాహకాలు ఇవ్వాలంటూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొందనీ, కానీ కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు కల్పిచడం లేదన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. తెెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసిందన్నారు. ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన మన వైద్య విద్యార్థులకు ఎదురైన దుస్థితి ఆందోళకరమన్నారు. ఆ విద్యార్థులు మన దేశంలోనే వైద్యవిద్య కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని ప్రధానిని లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదకరమన్నారు.
ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం
రాష్ట్ర రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ ఢిల్లీలో ధర్నా చేశామనీ, అందుకు రైతు జాతీయ నేత రాకేశ్ టికాయత్ మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కేంద్రం సానుకూలంగా స్పందించలేదని విమర్శించారు పైగా నూకలు తినాలని కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హదయాలను తీవ్రంగా గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి జాబితా పెరగడం ఆందోళనకరం
రాజ్యాంగంలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలను పొందుపరిచారని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోకి లాగేసుకుంటున్నదని విమర్శించారు. కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతున్నదనీ, రాష్ట్ర జాబితా తరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన సర్కారియా, పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయనీ, కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల నివేదికలను బుట్ట దాఖలు చేశాయని విమర్శించారు. కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నదని చెప్పారు.
ఉద్యోగాల నియామకంలో దేశానికి ఆదర్శం
గడిచిన ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందనీ, ఈ నియామకంలో దేశానికి రాష్ట్ర ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి భర్తీచేస్తున్నదన్నారు. ఉద్యోగార్థుల వయోపరిమితిపై ప్రభుత్వం పదేండ్ల సడలింపునిచ్చిందని చెప్పారు. అన్ని నియామక పరీక్షల్లో పోటీపడేందుకు వీలుగా మధ్యమధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించిందన్నారు. స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తున్నదనానరు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించిందనీ, ఈ సవరణ వల్ల ఇకనుంచి అటెండర్ నుంచి, ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలవుతుందని విమర్శించారు. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' అనే బహత్తర కార్యక్రమానికి నాంది పలికిందని తెలిపారు. రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని, కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
హైదరాబాద్ చుట్టు నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నాలుగుచెరగులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నదని సీఎం గుర్తు చేశారు. దీనిలో భాగంగా 2,679 కోట్ల రూపాయల వ్యయంతో అల్వాల్, ఎల్.బి.నగర్, సనత్ నగర్, గచ్చిబౌలీలలో ఈ ఆస్పత్రులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటవుతాయనీ, పీజీ కోర్సులు, నర్సింగ్, పారమెడికల్ కోర్సుల్లో విద్యనందిస్తామన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో మరో రెండువేల పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, దీంతో నిమ్స్ లో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రజావైద్యం, ఆరోగ్య రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
సామాజిక ఉద్యమంగా దళిత బంధు
దళితబంధు పథకం ఓ గొప్ప సామాజిక ఉద్యమమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. వారిని ఆర్థికంగా బలోపేతంచేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించాలనీ, దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నదనీ, ఇది రుణం కాదనీ, తిరిగి చెల్లించే పనిలేదనీ, పూర్తి గ్రాంట్గా ప్రభుత్వం అందిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన వచ్చిన పనిని లబ్దిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం 2.91 లక్షల డబుల్బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేశామనీ, సొంత జాగా ఉన్న వారికి రూ మూడు లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేండ్లలో పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచామని తెలిపారు. కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి మొక్కు తీర్చుకున్నామన్నారు.
వ్యవసాయం దండుగ కాదు.. పండగే
వ్యవసాయం దండుగ కాదనీ, పండగ అని నిరూపించామని సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరి నదులు మన రాష్ట్రం నుంచి ప్రవహిస్తున్నా సాగునీటికి నోచని రైతుల దుస్థితి చూసి చలించిపోయాయన్నారు. అందుకే, స్వరాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయరంగంపైనా, రైతుల సంక్షేమంపైనా ప్రత్యేక దష్టిని సారించామని వివరించారు. ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని విమర్శించారు.