Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించడంపై సర్కారు దృష్టి
- ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
- మొక్కజొన్న పిండితో చేసిన క్యారీబ్యాగ్ల ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, సమిష్టి బాధ్యతతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పీసీబీ కార్యాలయ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. మొక్కజొన్న పిండితో తయారైన పర్యావరణహిత సంచులను (క్యారీ బ్యాగ్) ఆవిష్కరించారు. ఎగ్జిబిషన్లోని స్టాళ్లను పరిశీలించారు. గాలి కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి వనరులను పొదుపుగా వాడటం, వాయు, జల, నేల కాలుష్య నియంత్రణను సామాజిక బాధ్యత తీసుకోవాలనీ, అప్పుడే కాలుష్యరహిత రాష్ట్రం, దేశం సాధ్యమని నొక్కి చెప్పారు. తెలంగాణకు హరితహారం, స్వచ్ఛ తెలంగాణ, జలహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ కాకతీయ లాంటి అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజలందర్నీ భాగస్వామ్యం చేయడంతో పర్యావరణ పరిరక్షణపై చాలామేరకు అవగాహన కలిగిందన్నారు. హరితహారం ద్వారా ఏడు విడతల్లో 250 కోట్ల మొక్కలు నాటామనీ, ఎనిమిదో విడతలో 19.54 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా దాదాపు 92 వేల కిలోమీటర్ల మేర మొక్కలను నాటామన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు చెప్పారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పీసీబీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా పరిశ్రమల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడం, గాలి, జల, నేల కాలుష్య నియంత్రణకు చొరవ తీసుకుంటున్న ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్, మేధ సర్వో డ్రైవ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, బయోకాన్ పరిశ్రమల ప్రతినిధులకు పురస్కారాలను ప్రదానం చేశారు. పర్యావరణంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటిల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అప్పిలేట్ అథారిటీ చైర్మెన్ ప్రకాశ్రావు, మెంబర్ డాక్టర్ జయతీర్ధరావు, ఎస్ఈఏసీ చైర్మెన్ కృష్ణారెడ్డి, పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్ శివకుమార్, కార్పొరేటర్ లక్ష్మి బాల్రెడ్డి, సీఈడీ రఘు, పీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీవాత్సవ్, కార్యదర్శి కృపాకర్, తదితరులు పాల్గొన్నారు.