Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీసేవలో మార్పులు చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల దరఖాస్తు ఫారంలో ఆస్తుల వివరాల జాబితాను తొలగించాలని రాష్ట్ర సర్కారు మీసేవ నిర్వాహకులను ఆదేశించింది. ఈ మేరకు సీసీఎల్ఏ అధికారులు మీసేవ కమిషనర్కు మార్గదర్శకాలను జారీ చేస్తూ లేఖ రాశారు. రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం..వ్యవసాయ భూమి, ఇంటిస్థలం, రెసిడెన్షియల్ ప్లాట్లకు సంబంధించి కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని సడలించి అన్ని రకాలుగా కుటుంబ ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదని పేర్కొంది. ఈ మేరకు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మీ సేవలో మాత్రం మార్పులు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న తరుణంలో పలువురు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దరఖాస్తుతో పాటు ధ్రువపత్రంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న దరఖాస్తు యధావిధిగా ఉంటుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం చేసే దరఖాస్తులో మాత్రం ఆస్తుల వివరాల విభాగాన్ని తొలగించింది. ఐదెకరాల వ్యవసాయ భూమి, ప్లాట్ల వివరాన్ని కూడా తీసేసింది. ధ్రువపత్రంలోనూ ఆస్తుల వివరాలకు సంబంధించిన విభాగం లేకుండా మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అందుకు అనుగుణంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సర్వీసులోని దరఖాస్తులో మార్పులు చేయాలని మీసేవకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.