Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కబ్జాలు చేస్తే సీఎం ఎవరిని ఉపేక్షించరు : 'తీగల' వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-ఫరూఖ్నగర్
'తీగల కృష్ణన్నను ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారు.. నేను ఆయన్ను కలిసి మాట్లాడుతా.. ఇదేం పెద్ద ఇష్యూ కాదు' అంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూ కబ్జాలు చేసిందని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలపై స్థానిక మీడియా ప్రశ్నించగా.. మంత్రి మాట్లాడుతూ.. కృష్ణన్న (తీగల కృష్ణారెడ్డి) ఎందుకు అలా మాట్లాడారో తెలియదని చెప్పారు. తనపై భూ కబ్జాలు, ఇతర కబ్జాలు చేసినట్టు ఆరోపణలు వస్తే వాటిపై ముఖ్యమంత్రి విచారించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తనపై విచారణ జరుపుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కబ్జాలు చేసి ఉంటే అలాంటి వాటిని ప్రభుత్వం ఉపేక్షించదని, తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారంటూ పేర్కొన్నారు. ఆయన అలా ఎందుకు తనపై మాట్లాడుతున్నారో తెలియదని, దాని గురించి తెలుసుకుంటానని తెలిపారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ఈట గణేష్, ఎంపీపీ ప్రియాంక శివశంకర్గౌడ్, తదితరులు ఉన్నారు.