Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదాం ఎదుట ధర్నా
నవతెలంగాణ -నల్లగొండ
భారత ఆహార సంస్థ గొల్లగూడ గోదాంలో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికుల అక్రమ తొలగింపులను ఆపాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఐ గొల్లగూడ గోదాం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా ఎఫ్సీఐ గోదాంలో మహిళలు 40 మంది, పురుషులు 20 మంది క్యాజువల్ కార్మికులుగా పని చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మహిళలు 10 మంది, పురుషులు 10 మందికి మాత్రమే పని ఉంటుందని, మిగతా 40 మందికి పని లేదని ఎఫ్సీఐ డీఎం చెప్పడంతో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఏండ్లుగా పనిచేస్తున్న వారిని పని నుంచి తొలగించడం సరికాదన్నారు. అధికారులు స్పందించి క్యాజువల్ కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సీఐ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నకిరేకంటి సుందరయ్య, కార్యదర్శి పల్లె నగేష్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, క్యాజువల్ కార్మికులు పాల్గొన్నారు.