Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ కృషి..
- వారి అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సర్వమతాల సమ్మేళనం. పలు సంస్కృతులు నెలకున్న ప్రాంతం. ఇక్కడి జీవన సబ్యతను మహాత్మాగాంధీ' గంగా జమున తెహజీబ్'గా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం సకల మతాలను సమాన భావనతో ఆదరిస్తున్నది. వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నది. గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో మైనార్టీల సంక్షేమానికి రూ. 6,644కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది.రాష్ట్రం ఏర్పడే నాటికి మైనార్టీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే ఉన్నాయి. ఎనిమిదేండ్ల కాలంలో వారికి విద్యా అవకాశాలు మెరుగుపరిచే ఉంద్ధేశంతో కొత్తగా 192 గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
బాలికలు చదువులో ముందుండాలి...
మైనార్టీ బాలికలు చదువులో ముందుండాలన్నది ప్రభుత్వం ఆకాంక్ష. అందుకే వారి కోసం 50శాతం బాలికల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వీటికి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మైనార్టీ గురుకులాల సంఖ్య 204కు పెరిగింది. వీటిలో మొత్తం లక్షా 14వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి విద్యార్థినీ,విద్యార్థులపై ఏడాదికి రూ. 1,20లక్షలు ఖర్చు చేస్తున్నారు.ఆయా గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి, భోజనం ప్రభుత్వం కల్పిస్తున్నది.
జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్..
మైనార్టీ బాలికలు పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం 121 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా ఆప్గ్రేడ్ చేసింది. దీంతో వారి ఎన్రోల్మెంట్ గతంలో 18శాతం ఉంటే..ప్రస్తుతం 42శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల మైనార్టీల్లో సంతృప్తిని కలిగిస్తున్నదని వారు చెబుతున్నారు. మైనార్టీ బాలికల విద్యావికాసంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం విశేషం.
అన్ని హంగులతో పక్కా భవనాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 54 రెసిడెన్షియల్ మైనార్టీ గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం అన్ని హంగులతో సకల సౌకర్యాలతో కొనసాగుతున్నది. హైదరాబాద్లోని 29 కాలేజీల భవనాల నిర్మాణం కోసం వక్ఫ్ బోర్డుతో సంప్రదించి ప్రభుత్వం భూములను కేటాయించింది. ఇందులో భాగంగా నాంపల్లిలోని అనాథ శరణాలయం అనీస్-ఉల్-గుర్బాను పునర్మించింది. ఈ భవనం ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
ఇమాం, మౌజమ్లకు గౌరవ వేతనం..
రాష్ట్రంలోని మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే పది వేల మంది ఇమాం,మౌజమ్లకు నెలకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తున్నది. మైనార్టీల ప్రధాన పండుగలైన క్రిస్మస్,రంజాన్లను ప్రభుత్వ పండుగలుగా నిర్వహిస్తున్నది. ఈ సందర్బంగా కొత్త బట్టలను కానుకగా అందిస్తున్నది. ప్రార్థనా మందిరాలకు ప్రత్యేక నిధులను సమకూరుస్తున్నది. మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది.