Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఈ నెల 3,4 తేదీల్లో పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న హెచ్చరించారు. ఆ జాబితాలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, అదిలాబాద్, కొమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా పడొచ్చు. అయితే, వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతున్నది. బంగాళాఖాతంలో నెలకొన్న ఆవర్తనం బలహీనపడింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మొత్తం 99 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా మామ్డలో అత్యధికంగా 5.78 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. వచ్చే 48 గంటల పాటు ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.