Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాలుగో మహాసభ ప్రారంభం
- తొలి రోజు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బహిరంగసభ
- పాల్గొననున్న రాజ్యసభ సభ్యులు డాక్టర్.వి.శివదాసన్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- మూడ్రోజులపాటు ప్రతినిధుల సమావేశాలు
- 700 మంది ప్రతినిధుల రాక
- నగరమంతా భారీ స్వాగత తోరణాలు, హోర్డింగ్లు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'చదువుతూ పోరాడు.. చదువు కోసం పోరాడు' అన్న నినాదంతో 'హలో విద్యార్థి.. చలో కరీంనగర్' పిలుపుతో అఖిల భారత విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర నాలుగో మహాసభ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 11గంటలకు తెలంగాణచౌక్ నుంచి వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ సభాస్థలి వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పేరుతో ఏర్పాటు చేసిన సభాప్రాంగణం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్.వి.శివదాసన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 700 మంది ప్రతినిధులు పాల్గొనన్నారు. మహాసభ నేపథ్యంలో.. కరీంనగర్ మొత్తం లాల్నీల్ రంగుల జెండాలు, స్వాగతతోరణాలు, పోస్టర్లు, భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సుమారు వంద మందికిపైగా విద్యార్థి నేతలు మంగళవారం అర్ధరాత్రి వరకూ ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభ అనంతరం అదే రోజు సాయంత్రం 3గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రతినిధుల సమావేశం 15, 16 తేదీల వరకూ జరగనుంది. విద్యారంగం సమస్యలపై సుమారు 25 అంశాల పట్ల తీర్మానాలు చేసి రాబోయే మూడేండ్ల కాలానికి పోరాట ప్రణాళికలను రూపొందించుకోనున్నారు. చివరి రోజున ప్రతినిధులంతా కలిసి రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోనున్నారు.
అమరుల పేర్లతో మహాసభ ప్రాంతాలు
మహాసభ బహిరంగ సభాస్థలికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పేరును నామకరణం చేశారు. ప్రతినిధుల సమావేశం జరిగే ప్రాంతానికి విద్యార్థి ఉద్యమాల్లో అమరులైన జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకుడు కన్నూరి రమేష్ నగర్గా, సమావేశంలో ప్రతినిధులు ఆసీనులయ్యే ప్రాంతానికి పసూలమారుతి భవన్గా నిర్ణయించారు.
సభలో పాల్గొనే వక్తలు.. కార్యక్రమాల వివరాలు..
- బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ చౌక్ నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభాస్థలి వరకు భారీ ర్యాలీ
- రాజ్యసభ సభ్యులు డాక్టర్ వి.శివదాసన్, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వి.పి.సాను, జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, రాష్ట్ర గర్ల్స్ వింగ్ కన్వీనర్ ఎం.పూజ, కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, శనిగరపు రజనీకాంత్ ప్రసంగించనున్నారు.
- సభ సందర్భంగా విద్యారంగ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ప్రత్యామ్నాయ దారులపై ప్రముఖులు ప్రసంగించనున్నారు. వీరితోపాటు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు సౌహార్థ సందేశాలు ఇవ్వనున్నారు.
- గురువారం, శుక్రవారం (15, 16తేదీల్లో) రోజుల్లో నగర శివారులోని శుభంగార్డెన్స్లో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. చివరి రోజున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోనున్నారు.
- మహాసభ సందర్భంగా డప్పు కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.