Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేల బేరసారాలపై మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ద్వారా అక్కడి ప్రభుత్వాలను కూలుస్తున్న బీజేపీ... తెలంగాణలో మాత్రం పప్పులో కాలేసిందని రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. బేరసారాలకు సంబంధించి అడ్డంగా బుక్కయిన ఆ పార్టీ పరిస్థితి... కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. ''మారు వేషాల్లో వచ్చిన స్వామీజీలు, మఠాధిపతులు తమకు తెలియదని భాజపా నేతలు బుకాయించారు. ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత ఆయా నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడేమో తడి బట్టలతో ప్రమాణం చేస్తానంటారు.. ఈకేసు విచారణ ఆపండి, సీబీఐకి ఇవ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టులో కేసులు వేస్తారు. తడి బట్టలు, పొడి బట్టలు... ప్రమాణాలు.. ఏమిటీ విచిత్ర పరిస్థితి...' అని హరీశ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కొనుగోలుకు వచ్చి భాజపా అడ్డంగా దొరికిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం దొంగలను పట్టుకుని జైల్లో పెట్టిందనీ, ఈ నేపథ్యంలో సంబంధం లేని కేసులో బీజేపీ నేతలు ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళుతున్నారు..? అని ప్రశ్నించారు. సిట్ను రద్దు చేయమంటూ వారు ఎందుకు అడుగుతున్నారు? అని నిలదీశారు. విచారణ జరిగితే భాజపా బండారం బయటపడుతుందనే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయబోమని చెప్పాలి.. చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం అదేనని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోందని వివరించారు. కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వాలంటున్న బీజేపీ నేతలకు తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదా? అని అడిగారు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సిట్ విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళి సై తుషార్ పేరును మీడియా ముందు ఎందుకు ప్రస్తావించారో తెలియదని ఎద్దేవా చేశారు. నిరంజన్రెడ్డి మాట్లాడుతూ... 'ఉత్తమ విధానాలతోనే ప్రజాస్వామ్య ఫలితాలు అందుతాయి. మంచి పాలనను ప్రజలు హర్షిస్తేనే పార్టీల మనుగడ ఉంటుంది. కానీ, ప్రజల మద్దతు లేకున్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తోంది. తద్వారా తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటోందని' విమర్శించారు.