Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజుల్లో డాక్టర్ల నియామకం
- స్టాఫ్ నర్స్, స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులపై నోటిఫికేషన్ ఇస్తాం
- రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగాన్ని బలోపేతం చేస్తాం
- పీహెచ్సీల మానిటరింగ్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బస్తీ దవాఖానాల స్ఫూర్తితో త్వరలో పల్లె దవాఖానాలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారనీ, తద్వారా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గిస్తామన్నారు. మునుగోడు ఎన్నికల వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైందనీ, ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వారం రోజుల్లో డాక్టర్ల నియామకం పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో పీహెచ్సీల మానిటరింగ్ హబ్ను మంత్రి ప్రారంభించారు. ఇదిలా ఉండగా మానిటరింగ్ హబ్ను ప్రారంభించిన అనంతరం మంత్రి కుషాయిగూడ, సూర్యాపేట జిల్లా అంబేద్కర్నగర్, సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్నగర్ పీహెచ్సీ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సిద్ధిపేటకు చెందిన హరిత, అన్నపూర్ణ అనే పేషెంట్లతో మాట్లాడి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 887 పీహెచ్సీల్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామనీ, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీకి వాటిని అనుసంధానించినట్టు చెప్పారు. ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా పీహెచ్సీలను మానిటర్ చేసే అవకాశం కలుగుతున్నదన్నారు. ఏవైనా ఔట్ బ్రేక్ కలిగిన సమయంలో సలహాలు సూచనలు ఇస్తారని వివరించారు. డాక్టర్లు ఆయా పీహెచ్సీలోని ఫార్మసీ, ల్యాబ్ను మాటనిటర్ చేసే అవకాశం కలుగుతున్నదన్నారు. రానున్న కాలంలో అన్ని పీహెచ్సీల్లో వైద్యులు ఉంటారనీ, పల్లె దవాఖానాల కోసం 1,569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 331 బస్తీ దవాఖానలు పని చేస్తున్నాయనీ, వీటిని 500కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఈసందర్భంగా తెలిపారు. ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైందనీ, వీటి వల్ల ఉస్మానియా, గాంధీ, ఫీవర్ వంటి హాస్పిటల్లపై ఒత్తిడి తగ్గిందన్నారు. 2019లో ఉస్మానియా ఆస్పత్రిలో 12 లక్షలు ఓపీ ఉంటే, ఈ ఏడాది ఐదు లక్షలకు తగ్గిందన్నారు. గాంధీలో 6.5లక్షల నుంచి 3.70 లక్షలకు, నిలోఫర్లో 8 లక్షల నుంచి 5.5 లక్షలకు, ఫీవర్ హాస్పిటల్లో 4 లక్షల నుంచి 2 లక్షలకు తగ్గిందని చెప్పారు. ఫలితంగా అక్కడ సర్జరీల పెరిగాయని వివరించారు. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రులతో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. సీసీ కెమెరాలతో సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుందనీ, ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలో మొదటిసారని చెప్పారు. 43 పీహెచ్సీలకు రూ.67కోట్లతో కొత్త బిల్డింగ్లను మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. 372 పీహెచ్సీల మరమ్మత్తులను రూ.43.18కోట్లతో చేపట్టినట్టు చెప్పారు. 1239 సబ్ సెంటర్ల కొత్త భవనాలను మంజూరని చేశామనీ, ఒక్కోదానికి రూ.20లక్షల ఖర్చు చేస్తున్నామన్నారు. అన్నింటికి కలిపి మొత్తంగా రూ.247 కోట్లు వెచ్చించామన్న ఆయన...1,497 సబ్ సెంటర్లను 59 కోట్లతో మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ డయాగస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేసినట్టు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందనీ, ప్రజలకు సేవ చేశానన్న సంతప్తి కలిగిందని తెలిపారు. స్టాఫ్ నర్స్, 1165 స్పెషలిస్ట్ డాక్టర్ నోటిఫికేషన్ త్వరలో ఇవ్వనున్నట్టు తెలిపారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. ఇందులో తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి చొరవ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.