Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా కేంద్రం అవార్డు
- మంత్రి హరీశ్ రావు హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టెలి కన్సల్టేషన్ సేవల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మూడో స్థానం సాధించింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సంద ర్భంగా శనివారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ చేతుల మీదుగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు నిర్వహించిన టెలి కన్సల్టేషన్ క్యాంపెయిన్లో మన రాష్ట్రం సత్తా చాటింది. దాదాపు రెండు నెలల కాలానికిగాను 17,47,269 కన్సల్టేషన్స్ పూర్తి చేసింది. మొదటి స్థానంలో తమిళనాడు, రెండో స్థానంలో ఏపీ నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,876 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్ల నుంచి టెలి కన్సల్టేషన్ ద్వారా 12 రకాల పైగా స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 27,24,247 మంది టెలి కన్సల్టేషన్ సేవలు పొందారు. రాష్ట్రానికి మూడో స్థానం లభించడం పట్ల ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అరోగ్య రంగంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.