Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిసిగ్గుగా బండి సంజయ్ వ్యాఖ్యలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-ఖమ్మం
ఎమ్మెల్సీ కవితపై సీబిఐ విచారణ వెనక కుట్ర దాగి ఉందని, విచారణ నిష్పక్షపాతంగా చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ్యుల కొనుగోలు అంశం విఫలమైన తర్వాత బీజేపీ ఈడీ, సీబీఐ విచారణను తీవ్రతరం చేసిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలు నిసిగ్గుగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేయడమే కాక, ప్రతిపక్ష నేతలనూ బెదిరించి బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా బండి వ్యవహారశైలి ఉందని ఆరోపించారు. సీబీఐ రావాలంటే రాష్ట్ర అనుమతి తీసుకోవాలని, కానీ అనుమతి తీసుకోకుండానే ఎలా విచారణ చేస్తారని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లలిత్ మెడీ, విజరు మాల్యాలపై చర్యలు తీసుకోకుండా తాత్సర్యం చేస్తుందన్నారు. మరో పక్క కార్పొరేట్ శక్తులుగా విరాజిల్లుతున్న అదానీ, అంబానీల ఆస్తులను పైపైకి పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. దాంతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అడుగడుగునా రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. కవితపై సీబీఐ విచారణను లైవ్లో చేపట్టి బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు.