Authorization
Tue April 29, 2025 05:15:48 pm
- వైద్యారోగ్యశాఖ కమిషనర్కు ఆశా యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంటి వెలుగు కార్యక్రమానికి ఆశాలకు అదనంగా పారితోషికాలు చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు ఆ యానియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి, ఆర్.నీలాదేవి, రాష్ట్ర కోశాధికారి పి.గంగమణి వైద్యారోగ్యశాఖ కమిషనర్ శ్వేతామహంతికి వినతిపత్రం సమర్పించారు. వంద రోజుల పాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18న ప్రారంభం కానుండగా, ఇప్పటి వరకు ఆశాలకు అదనపు పారితోషికం నిర్ణయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం లేదనీ, పనిని బట్టి పారితోషికాలు ఇస్తున్నారనీ, ఆశాలు చేసే కార్యక్రమాల జాబితాలో కంటి వెలుగు లేదని గుర్తు చేశారు. కంటి వెలుగు అదనపు కార్యక్రమమనీ, ఆ మేరకు అదనపు పారితోషికం వెంటనే నిర్ణయించాలని కోరారు. అదనపు పనులను ఉచితంగా చేయించుకోవాలని ప్రభుత్వం యోచించడం సరి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫిక్స్డ్ వేతనం లేక, అదనపు పారితోషికాలు చెల్లించక ఆశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆశాలు నష్టపోకుండా చూడాలని కోరారు.