Authorization
Fri May 02, 2025 11:12:33 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బరితెగించి అడ్డూఅదుపూ లేకుండా ప్రజలపై పెనుభారాలు మోపుతున్నాయని విమర్శించారు. రోజురోజుకు పాలకులు అను సరిస్తున్న విధానాలు చూసిన తర్వాత ప్రజల భ్రమలు తొలగిపోతున్నా యన్నారు.నిరుద్యోగం, ఆకలి పెరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు.రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీసమద్దతుధర ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.పేదలందరికీ డబుల్బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం విస్తతంగా ఇంటి నిర్మాణం చేపట్టలేదన్నారు.నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు ఇచ్చిన పాపానపోలేదన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్,ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉంచడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంపదను స్వదేశీ, విదేశీ గుత్తా పెట్టుబడిదారీ సంస్థలకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు.పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్శక్తులకు మాత్రం ఆదాయపుపన్ను నుండి మినహాయింపు 7 శాతం ఇచ్చిందన్నారు.మతోన్మాద, విచ్ఛిన్నకర విధానాలకు పాల్పడుతున్న బీజేపీ రానున్నకాలంలో దేశ ప్రజానీకం బుద్ధి చెప్పడం ఖాయని చెప్పారు.అంతకుముందు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పచ్చిమట్టల పెంటయ్య ప్రథమవర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, ధీరావత్ రవినాయక్, బుర్రి శ్రీరాములు,మట్టిపల్లి సైదులు, ఎలుగూరి గోవింద్, కోట గోపి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు ,పారేపల్లి శేఖర్రావు,కొదమగుండ్ల నగేష్,షేక్యాకుబ్, దేవరం వెంకట్రెడ్డి, కందాలశంకర్రెడ్డి, పులుసుసత్యం, మద్దెలజ్యోతి, కొప్పులరజిత, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయినరవి, వేల్పులవెంకన్న, చెరుకు యాకలక్ష్మి, మేకనబోయిన సైదమ్మ, పల్లె వెంకట్రెడ్డి,మేకనబోయిన శేఖర్, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, మిట్టమడుగుల ముత్యాలు, బెల్లంకొండ సత్యనారాయణ, చిన్నపంగ నర్సయ్య పాల్గొన్నారు.